చంద్రబాబుకి షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ

March 18, 2022


img

రాజకీయాలలో ఉన్నవారు ఒక్కోసారి అనాలోచితంగా లేదా యాదృచ్ఛికంగా మాట్లాడిన మాటలు చాలా ఇబ్బందికరంగా మారుతుంటాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలతో మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తోందిప్పుడు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే, “పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ తయారు చేసే కంపెనీ ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి దానిని కొనుక్కోమని చెప్పారు. దాంతో ఎవరి ఫోన్లు అయినా చాలా సులువుగా హ్యాకింగ్ చేయవచ్చని తెలిపారు. కానీ నాకు అటువంటి ఆలోచనలు లేవు కనుక నాకు పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ అవసరం లేదని చెప్పాను. అప్పుడు వారు మాజీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను మా కంపెనీ నుంచి కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారని చెప్పారు. అయినా నాకు అది అవసరం లేదని వారికి చెప్పి పంపించేశాను,” అని చెప్పారు. 

మమతా బెనర్జీ ఆలోచించి మాట్లాడారో లేదో కానీ ఈవిదంగా మాట్లాడి చంద్రబాబు నాయుడుకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. గతంలో ఆయనపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని గట్టిగా ఖండించారు. కానీ ఇప్పుడు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేశారని చెప్పడంతో వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆయనను గట్టిగా నిలదీసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టకమానరు. కనుక మమతా బెనర్జీ మాటలతో చంద్రబాబు నాయుడుకి కొత్త తలనొప్పులు తప్పకపోవచ్చు. 


Related Post