హుజూరాబాద్ ఓటమితో కేంద్రంపై కత్తి దూసిన టిఆర్ఎస్ ఇప్పటికే జోరుగా యుద్ధం కొనసాగిస్తోంది. ఈరోజు అధికారికంగా యుద్ధ ప్రకటన కూడా చేసింది. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ యుద్ధ ప్రకటన చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం మాకొద్దు. దీనిని గద్దె దించాల్సిందే. కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని కూల్చేవరకు టిఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. మా ఈ ప్రయత్నంలో దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న అన్ని శక్తులకు మా మద్దతు ఉంటుంది. అలాగే వాటి సహకారంతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తారు. తగిన సమయంలో వారందరితో సిఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడుతారు,” అని అన్నారు.
టిఆర్ఎస్ కేంద్రంపై గురి పెట్టినప్పటికీ దాని అసలు లక్ష్యం రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడమే అని అందరికీ తెలుసు. కానీ ఈ ప్రయత్నంలో కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం వలన ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి? రాష్ట్రంపై వాటి ప్రభావం ఏవిదంగా ఉండబోతోంది?అనేది రాబోయే రోజుల్లో క్రమంగా కంటికి కనబడుతుంది.