కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. గత ఏడాది తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించారు. వాటితో దేశంలో రైతులకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు కోరారు.
శుక్రవారం ఉదయం దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ, “మా ప్రభుత్వం ఏమి చేసినా రైతుల సంక్షేమం కోసమే చేస్తుంది. అదే ఉద్దేశ్యంతో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చాము. కానీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ వాటి వలన కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి ఒప్పించలేకపోయాము. అందుకే రైతుల కోరుతున్నట్లుగానే ఆ మూడు వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేస్తున్నాము. వీటి వలన రైతులకు ఇబ్బంది కలిగించినందుకు నేను ప్రభుత్వం తరపున క్షమాపణలు కోరుతున్నాను. త్వరలో ప్రారంభం అయ్యే పార్లమెంటు సమావేశాలలో వీటి రద్దుకు సంబందించి రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇస్తున్నాను. కనుక ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతు సోదరులందరూ మీ గ్రామాలకు వెళ్ళి మళ్ళీ వ్యవసాయ పనులు చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.