ఆదివారం రాత్రి దుబాయిలో జరిగిన టి-20 ప్రపంచ కప్ మ్యాచ్లో పాక్ చేతిలో భారత్ జట్టు ఓడిపోయింది. అయితే భారత్ జట్టు మెంటర్ (మార్గదర్శకుడు) మహేంద్ర సింగ్ ధోనీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ పాక్ జట్టు ఆటగాళ్ళను మనసారా అభినందించడం, అందుకు ప్రతిగా భారత్ జట్టును తమ అద్భుతమైన బ్యాటింగ్తో ఓడించిన మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్లు చాలా ఆప్యాయంగా విరాట్ కొహ్లీని కౌగలించుకొని కృతజ్ఞతలు తెలపడం ఈ మ్యాచ్లో ఓ అద్భుతమైన సన్నివేశం, కొసమెరుపు అని చెప్పవచ్చు.
వారిరువురే భారత్ జట్టు ఓటమికి కారణం అయినప్పటికీ వారిని విరాట్ కోహ్లీ మనసారా అభినందించి హుందాతనం చాటుకొని భారత్, పాక్ క్రీడాభిమానుల హృదయాలు గెలుచుకొన్నారు. అలాగే ధోనీ కూడా పాక్ క్రికెటర్లతో ఆప్యాయంగా మాట్లాడి అందరి హృదయాలు గెలుచుకొన్నారు.
ఓటమిని జీర్ణించుకోవడం, అదే సమయంలో తమ ఓటమికి కారకులైన వారిని మనసారా అభినందించడం రెండూ చాలా కష్టమే. కానీ ధోనీ, కోహ్లీ ఇద్దరూ గెలుపోటముల కంటే క్రీడాస్పూర్తి, మానవ సంబంధాలే మిన్న అని నిరూపించారు. ధోనీ, కోహ్లీ ఫోటోలను చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది.