నేడు రాణా, ముమైత్ ఖాన్ వంతు

September 08, 2021


img

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసుతో ముడిపడున్న మనీలాండరింగ్ కేసులలో విచారణ నిమిత్తం నేడు ప్రముఖ హీరో రాణా దగ్గుబాటి, నటి ముమైత్ ఖాన్ ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. వారిరువురికీ మాదక ద్రవ్యాల డీలర్ కెల్విన్‌తో ఎటువంటి సంబంధాలున్నాయి?విదేశాల నుంచి మాదక ద్రవ్యాల కొనుగోలుకు వారి బ్యాంక్ ఖాతాల నుంచి ఎవరెవరికి ఎంత డబ్బు పంపారు? తదితర అంశాలపై ఈడీ అధికారులు వారిరువురినీ ప్రశ్నిస్తున్నారు. 

ఈ కేసులో మొత్తం 12 మందికి ఈడీ నోటీసులు పంపించగా ఇప్పటివరకు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీ, పూజా హెగ్డే, నందులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. నేడు రాణా, ముమైత్ ఖాన్‌లను ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా సినీ, మోడలింగ్, క్రీడలు వంటి కొన్ని రంగాలలో ఈ మాదక ద్రవ్యాల వాడకం ఉంటుంది. విపరీతమైన పని ఒత్తిడి, వైఫల్యాలు వంటి కారణాలతో కొందరు వీటికి అలవాటుపడుతుండగా, మరికొందరు స్నేహితులతో కలిసి సరదాగా మొదలుపెట్టి చివరికి వాటికి బానిసలవుతుంటారు. టాలీవుడ్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు కానీ ఇంతమంది హేమాహేమీలు ఈ ఊబిలో చిక్కుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

మాదక ద్రవ్యాల కేసులో వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం కాస్త కనికరం చూపినప్పటికీ, కేంద్రం అధీనంలో పనిచేసే ఈడీ వదిలి పెట్టకపోవచ్చు. కనుక ఈ కేసులో జైలు శిక్షలు, వాటి నుంచి బయట పడటానికి న్యాయ పోరాటాలు కూడా తప్పకపోవచ్చు. ఈ కేసుల్లో నిందితులుగా పేర్కొన్నవారు ఒత్తిళ్ళు, సమస్యలు నుంచి బయటపడటానికి మాదక ద్రవ్యాలను ఆశ్రయించి ఉంటే, ఇప్పుడు ఈ కేసులతో ఇంకా ఎక్కువ ఒత్తిడిని, సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. ఇంతేకాదు...ఈ విచారణపై మీడియాలో వస్తున్న వార్తలతో సమాజంలో వారి పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలుగుతోంది.


Related Post