సిఎం కేసీఆర్ ఆగస్ట్ 2న నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో పర్యటించనున్నారు. సాగర్ ఉపఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు సిఎం కేసీఆర్ వస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధిపనులపై వారితో చర్చిస్తారని చెప్పారు.
ఎన్నికల హామీల అమలుపై సమీక్షా సమావేశం కోసం సిఎం కేసీఆర్ ప్రత్యేకంగా సాగర్ నియోజకవర్గంలో పర్యటించడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ పని ఆయన ప్రగతి భవన్ నుంచే చేయగలరు. ‘సిఎం కేసీఆర్ ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడమే తప్ప వాటిని అమలుచేయరని, దళిత బంధు పధకం కూడా అటువంటిదేనని...’ హుజూరాబాద్లో ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసమే బహుశః సిఎం కేసీఆర్ నాగార్జునసాగర్లో పర్యటిస్తున్నారేమో? కానీ ఎన్నికలలో గెలిచిన తరువాత ఆ నియోజకవర్గం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిపెడుతుండటం స్వాగతించవలసిందే.