ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిన్న భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. “జీహెచ్ఎంసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి తన మల్కాజిగిరి నియోజకవర్గంలో అభ్యర్ధులనే గెలిపించుకోలేకపోయారు. ఒకరిద్దరు తప్ప అందరూ డిపాజిట్లు కోల్పోయారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులందరినీ గెలిపించుకొనే సత్తా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా పార్టీలో ఎవరికీ లేదు. కనుక ఏడాది ముందుగానే శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లు ప్రకటించి వారిని గెలిపించుకొనే బాధ్యత పార్టీలో ప్రతీ ఒక్కరూ తీసుకోవాలి. కేవలం గాంధీభవన్లో కూర్చొని మీడియాకు స్టేట్మెంట్లు ఇస్తూ ఫోటోలు దిగితే సరిపోదు. గాంధీభవన్కు నేను వెళ్ళినా వెళ్లకపోయినా నా నియోజకవర్గంలో గెలుపు గుర్రాలను నేనే ఎంపిక చేసుకొంటాను. వారిని గెలిపించుకొనే బాధ్యత నాదే. నన్ను కాదని వేరెవరినీ ఎంపిక చేసినా నేను అంగీకరించను.,” అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన కొత్తగా పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వర్గీయ వైఎస్సార్ వంటి మహానాయకుడు మరొకరు మళ్ళీ పుట్టరని, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అటువంటి గొప్ప నాయకులు లేరని వెంకట్ రెడ్డి అన్నారు.