అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్కు టిఆర్ఎస్ ప్రభుత్వం మరో ఉచ్చు సిద్దం చేస్తోందా?అంటే అవుననే చెప్పుకోవాలేమో?ఈరోజు ఏసీబీ అధికారులు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. సొసైటీలో అవకతవకలు జరుగుతున్నాయని, ఎగ్జిబిషన్ షాపుల కేటాయింపులో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. డీఎస్పీ శ్రీకాంత్ అధ్వర్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీకి అధ్యక్షుడుగా ఉండేవారు. మంత్రి పదవి కోల్పోయిన తరువాత ఆయన ఎగ్జిబిషన్ సొసైటీకి అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కానీ సుమారు ఏడేళ్ళపాటు సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు కనుక సొసైటీలో అవకతవకలు జరిగినట్లయితే వాటికి ఆయన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు కనుక ఈటల రాజేందర్ మెడకు సొసైటీ అక్రమాల ఉచ్చు కూడా చుట్టుకోవచ్చు.