రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా...రాష్ట్రాభివృద్ధి...ప్రజల సంక్షేమం ముఖ్యమా అని ప్రశ్నిస్తే రెండోదే ముఖ్యమని అర్దమవుతుంది. కానీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆంధ్రాకు చెందిన ఓ రాజకీయనాయకుడు అన్నారు. ఆయనే మాజీ కాంగ్రెస్ నేత...ప్రస్తుత టిడిపిలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి!
తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీ...దానినే నమ్ముకొని బ్రతుకుకున్న అనేకమంది కాంగ్రెస్ నేతలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టడంతో రెండూ నాశనమైపోయాయని దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం ఆయన హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయానికి వచ్చి అక్కడ కాంగ్రెస్ నేతలతో రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు గురించి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ, “తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ తప్పు చేశారు. విభజన సమయంలో పార్టీ అధిష్టానం తీసుకోబోతున్న నిర్ణయంతో ఏమి జరుగబోతోందో ఊహించలేక పార్టీలో కొందరు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీలుపడ్డారు. తెలంగాణ ఏర్పాటుతో రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ను కొట్టే మొగాడే లేడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది కనుక పార్టీలో నేతలు వేరే దారి చూసుకోకతప్పదు,” అని అన్నారు.