తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మూడు నెలలపాటు దూరంగా ఉంటానని నేడు ప్రకటించారు. కానీ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నట్లు తాను బిజెపిలో చేరడం లేదని, మూడు నెలల తరువాత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రకటిస్తానని చెప్పారు. అయితే ఆయన తన రాజీనామా లేఖను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారని, త్వరలోనే బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2014 లోక్సభ ఎన్నికలలో చేవెళ్ళ నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. కానీ 2018 శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన టిఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికలలో చేవెళ్ళ నుంచి పోటీ చేశారు కానీ టిఆర్ఎస్ అభ్యర్ధి రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.