దేశంలో మెట్రో రైల్వే ప్రాజెక్టు ఎక్కడ నిర్మిస్తున్నా ముందుగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ సలహాలు, సంప్రదింపులు తప్పనిసరి. ఇప్పుడు ఆయన తన సొంత రాష్ట్రమైన కేరళలో బిజెపిలో చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు. కేరళ బిజెపి అధ్యక్షుడు కె. సురేంద్రన్ ఈరోజు తిరువంతపురంలో ఆయనను పార్టీలో చేర్చుకోగానే ఆయనే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించారు.
నేటితో శ్రీధరన్ ఢిల్లీ మెట్రో నుంచి పదవీ విరమణ చేయనున్నారు. కనుక రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. త్వరలోనే పార్టీ అభ్యర్ధులందరినీ ప్రకటిస్తామని చెప్పారు.
దశాబ్ధాలుగా ఆయన దేశంలో అనేక నగరాలలో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ ఎన్నడూ ఆయనపై అవినీతి ఆరోపణలు రాలేదు. పైగా చేపట్టిన ప్రతీ ప్రాజెక్టును సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తూ మెట్రోమ్యాన్గా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకొన్నారు.
కేరళలో దశాబ్ధాలుగా కాంగ్రెస్ కూటమి, వామపక్ష కూటమి మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. ఆ ఆనవాయితీని బద్దలు కొట్టాలంటే శ్రీధరన్ వంటి గొప్ప మేధావి, నిష్కళంక చరిత్ర కలిగిన వ్యక్తే సరైన వ్యక్తని బిజెపి అధిష్టానం భావించి ఆయనను ముందుంచుకొని కేరళలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఆయనను చూసి కేరళ ప్రజలు బిజెపికి ఓట్లేస్తారో లేదో తెలియాలంటే మే2న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎదురుచూడాల్సిందే.