వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టికెట్ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికే ఖరారైంది. ఈవిషయం సిఎం కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ కార్యవర్గసమావేశంలో స్వయంగా తెలియజేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి త్వరలోనే అభ్యర్ధి పేరును ఖరారు చేస్తానని సిఎం కేసీఆర్ తెలిపారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కూడా టిఆర్ఎస్ గెలుపు ఖాయమని సిఎం కేసీఆర్ అన్నారు. టిఆర్ఎస్కు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎంతమాత్రం పోటీ కావని, ఒకటి రెండు ఎన్నికలలో బిజెపి గెలిచినంతమాత్రాన అది టిఆర్ఎస్తో పోటీపడలేదని సిఎం కేసీఆర్ అన్నారు.
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇస్తున్నట్లు సిఎం కేసీఆర్ ముందే తెలియజేయడం వలన ఆయన పార్టీ నేతలతో కలిసి ఇప్పటికే మూడు జిల్లాలలో ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారు కూడా. కనుక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి ఇస్తారో చూడాలి.