ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “హైదరాబాద్ మేయర్, డెప్యూటీ మేయర్ అభ్యర్ధుల పేర్లను ఎన్నిక జరిగే రోజున (ఫిబ్రవరి 11) సీల్డ్ కవరులో పంపిస్తాను. కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు అందరూ తప్పనిసరిగా వారినే ఎన్నుకోవాలి. దీనిపై ఇక చర్చ వద్దు,” అని స్పష్టం చేశారు.
మేయర్, డెప్యూటీ మేయర్ పేర్లను సీల్డ్ కవర్లో పంపిస్తానని, వారినే ఎన్నుకోవాలని సిఎం కేసీఆర్ విస్పష్టంగా చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయమే. నిజానికి ఈరోజు సమావేశంలో వారి పేర్లను ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ దాని వలన ఈ నాలుగు రోజులలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వెలువడవచ్చు. అలాగే ఈ అంశంపై బిజెపి మైండ్ గేమ్ ఆడే అవకాశం ఉంటుంది. దాంతో ఎన్నికకు ముందు పార్టీలో గందరగోళానికి దారితీయవచ్చుననే ఉద్దేశ్యంతోనే సిఎం కేసీఆర్ ఈసారి సీల్డ్ కవర్ ద్వారా ఇద్దరి పేర్లను సూచిస్తానని చెప్పి ఉండవచ్చు. అంతేకాదు ఈసారి మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికపై సిఎం కేసీఆర్ చాలా ఖరాఖండీగా నిర్ణయం తీసుకొని అందరినీ దానికి కట్టుబడి ఉండాలని కటువుగా సూచించడం విశేషమే.