మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సిఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. నిన్న శాసనసభ సీఎల్పీ కార్యాలయంలో మీడియావారు అడిగిన పలుప్రశ్నలకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు ఆశిస్తున్నవారే కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ చెప్పుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ కంటే మంత్రి కేటీఆరే ఎక్కువ అబద్ధాలు చెపుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ సీఎం అవ్వడం అసాధ్యమన్నారు. ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే వారి కుటుంబంలో అలజడి మొదలవుతుందని అన్నారు. దళితుదిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిన సిఎం కేసీఆర్ ఇప్పటికైనా తన కొడుకు కేటీఆర్కు బదులు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీఎంను చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొడంగల్లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చాలా అభివృద్ధి చెందిందని, అక్కడ టిఆర్ఎస్ గెలిచిన తరువాత అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. కొడంగల్లో తాను అభివృద్ధి చేయలేదని వాదిస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే అది నిరూపించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.