టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ గత కొన్ని రోజులుగా ‘త్వరలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు... ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్కు అన్ని అర్హతలు ఉన్నాయి...కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది...’అంటూ మాట్లాడుతున్నారు.
వారి మాటలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. శుక్రవారం అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, “టిఆర్ఎస్ నేతల మాటలు వింటుంటే వారు కేసీఆర్ కంటే కేటీఆరే బెటర్ అని భావిస్తున్నట్లుంది. ఒకవేళ అదే నిజమనుకొంటే టిఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ ఫెయిల్ అయినట్లు భావిస్తున్నారనుకోవలసి ఉంటుంది. వారి మాటలు వింటుంటే కేసీఆర్ పాలన ఇక చాలని చెపుతున్నట్లుంది. సిఎం కేసీఆర్ ఇటీవల తీసుకొన్న అనేక నిర్ణయాలు ఉపసంహరించుకోవలసి వచ్చింది. వయసు మీద పడుతుండటంతో ఆయన సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. బహుశః అందుకే ఆయనను రిటైర్మెంట్ తీసుకొని కొడుకును ఆ కుర్చీలో కూర్చోబెట్టాలని టిఆర్ఎస్ నేతలు కోరుతున్నట్లున్నారు. ఒకవేళ సిఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసే మాటయితే, మళ్ళీ ప్రజాభిప్రాయం ( శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని) కోరాలి,” అని అన్నారు.