తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్), బీఆర్ఎస్ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్)లపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, వాటిపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతున్నందున అది తేలేవరకు వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని, ప్రజలను ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం 2016లో బీఆర్ఎస్, కొన్ని నెలల క్రితం ఎల్ఆర్ఎస్ పధకాలను ప్రకటించింది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్ ప్రకటించడంతో వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయా రాష్ట్రాల హైకోర్టులలో, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఎనిమిది వారాలలోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించి ఆ కేసు విచారణను వాయిదా వేసింది. కనుక వాటిపై సుప్రీంకోర్టు విచారణ ముగిసిన తరువాతే హైకోర్టులో విచారణ చేపడతామని అప్పటివరకూ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఆదేశించారు.