మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే నరేందర్ అనుచరుల స్ట్రీట్ ఫైట్

January 20, 2021


img

ఖమ్మం జిల్లా తరువాత వరంగల్‌ జిల్లాలో కూడా టిఆర్ఎస్‌ నేతల మద్య కీచులాటలు బయటపడ్డాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నన్నపూనేని నరేందర్ అనుచరులు మంగళవారం సాయంత్రం వరంగల్‌లో ప్రజలందరూ చూస్తుండగా ఒకరినొకరు కొట్టుకొన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, నన్నపూనేని నరేందర్‌ల మద్య ఇంతకాలంగా సాగుతున్న ఆధిపత్యపోరు వారి అనుచరుల కొట్లాటతో బయటపడింది.

ఈ ఘటనలో పోలీసులు తన అనుచరులను రాత్రంత్రా సెల్లో ఉంచి, ఎర్రబెల్లి అనుచరులను స్టేషన్‌లో కూర్చోబెట్టి వారికి టీ కాఫీలు ఇచ్చి  రాచమర్యాదలు చేసి పంపారని నన్నపూనేని నరేందర్ ఆరోపించారు. చందాలు వసూలుచేసుకొంటూ చెంచాగిరీ చేసే రాజకీయ నాయకులకు భయపడి పోలీసులు తన అనుచరులను నిర్బందించారని నన్నపునేని నరేందర్ ఎర్రబెల్లిని ఉద్దేశ్యించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తక్షణం తన అనుచరులను బేషరతుగా విడిచిపెట్టి వారిపై దాడికి పాల్పడిన ఎర్రబెల్లి అనుచరులను తక్షణం అరెస్ట్ చేయాలని లేకుంటే విపరీత పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో బిజెపి చేతిలో ఎదురుదెబ్బలు తిన్న తరువాత జరుగబోతున్న వరంగల్‌ మునిసిపల్ ఎన్నికలు, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్‌ నేతల కీచులాటలు ఆ పార్టీ అధిష్టానానికి మరో సవాలుగా మారినట్లున్నాయి.


Related Post