ప్రధాని మోడీ చొరవతోనే వ్యాక్సిన్‌: ఎర్రబెల్లి

January 16, 2021


img

సాధారణంగా టిఆర్ఎస్‌ నేతల నోట ఎన్నడూ వినని ఓ మాట ఈరోజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నోట వినబడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవాళ్ళ వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఇంకా ఎదురుచూపులు చూస్తుంటే మన దేశంలో అప్పుడే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ప్రత్యేకశ్రద్ద చూపడం వలననే మన దేశంలో...రాష్ట్రంలో ఇంత త్వరగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం,” అని అన్నారు. 

సాధారణంగా టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటారు తప్ప ఏనాడూ ఈవిధంగా ప్రశంశించిన దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో కేటీఆర్‌ తరువాత స్థానంలో నిలుస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాని నరేంద్రమోడీని మాట మాత్రంగానైనా మెచ్చుకోవడం విశేషమే. ఇది యాదృచ్చిక్కంగా చేసిన ప్రశంశా…లేక కేంద్రం పట్ల టిఆర్ఎస్‌లో వస్తున్న మార్పుకి సంకేతమా?అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన సిఎం కేసీఆర్‌, ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఆ ఊసే ఎత్తడం లేదు.


Related Post