ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిచిన కార్పొరేటర్లను తెలియజేస్తూ నేడు ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. ఒకవేళ నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే సోమవారం తప్పకుండా గెజిట్ విడుదల చేయడం ఖాయమని తెలుస్తోంది. గజెట్ విడుదల చేసినట్లయితే నిబందనల ప్రకారం నెల రోజులలోగా కొత్తగా ఎన్నికైనవారి చేత ప్రమాణస్వీకారం కార్యక్రమం చేయించవలసి ఉంటుంది. ఆ తరువాత వారు మేయర్, డెప్యూటీ మేయర్లను ఎన్నుకొంటారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4న వెలువడ్డాయి. వాటిలో టిఆర్ఎస్-56, బిజెపి-48, మజ్లీస్-44, కాంగ్రెస్-2 స్థానాలు గెలుచుకున్నాయి. కనుక ఏ పార్టీకూడా వేరే పార్టీ మద్దతు లేకుండా సొంతంగా మేయర్ పదవి దక్కించుకోలేదు. ఎన్నికల సమయంలో టిఆర్ఎస్-మజ్లీస్ కటీఫ్ చెప్పుకొన్నప్పటికీ మేయర్, డెప్యూటీ మేయర్ పదవులు దక్కించుకొనేందుకు మళ్ళీ ఇప్పుడు చేతులు కలుపుతాయా లేదా చూడాలి. టిఆర్ఎస్కు ఎక్స్అఫీషియో సభ్యులున్నారు. వారి ఓట్లు వినియోగించుకొనే అవకాశం ఉంది.