తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీపై నాన్చుతుండటంపై ఉద్యోగసంఘాల నేతలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో సిఎం కేసీఆర్ వారితో చర్చలు జరపడానికి ఒక త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి జీవి రామకృష్ణ రావు, నీటి పారుదల ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ ఉన్నారు. జనవరి మొదటివారంలో ఈ త్రిసభ్య కమిటీ మొదటి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వేతన సవరణ సంఘం నుండి వచ్చిన నివేదికపై అధ్యయనం చేస్తుంది.
మళ్ళీ జనవరి రెండో వారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, పదోన్నతులు తదితర అంశాలపై చర్చించనుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జోనల్ విధానంలో ఉన్న న్యాయపరమైన చిక్కులను గురించి వాటిని అధిగమించేందుకు ఈ కమిటీ ప్రత్యామ్నాయాలను సూచిస్తుంది.