రాజకీయాలలోకి ప్రవేశిస్తానని గత మూడేళ్ళుగా ఊరిస్తున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇవాళ్ళ ఉదయం చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో తన అభిమానులు ఏర్పాటుచేసుకొన్న ‘రజనీ మక్కల్ మండ్రం’కు చెందిన జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. వారి సమక్షంలో తాను రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్లు ప్రకటిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ జిల్లా స్థాయిలో రజనీ మక్కల్ మండ్రం పరిస్థితి ఏవిధంగా ఉంది?దాని కార్యదర్శుల పనితీరు ఏవిధంగా ఉంది?వంటి అంశాలపై చర్చించి వారికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి సమావేశాన్ని ముగించారు. దాంతో వారందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అతి త్వరలోనే తన రాజకీయ ప్రవేశం గురించి నిర్ధిష్టమైన ప్రకటన చేస్తానని రజనీకాంత్ వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలలో కొందరు రజనీకాంత్ రాజకీయాలలోకి ప్రవేశిస్తే స్వాగతిస్తామని కానీ బిజెపితో పొత్తులు పెట్టుకోదలిస్తే వ్యతిరేకిస్తామని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొనే నిర్ణయం తీసుకొంటానని రజనీకాంత్ వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే రజనీకాంత్ ప్రతీ 4-5 నెలలకోసారి ఇలాగే హడావుడి చేయడం, ఆయన రాజకీయాలలోకి ప్రవేశిస్తారని అభిమానులు ఎదురుచూడటం, త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పి వెళ్ళిపోతుండటం జరుగుతోంది. ఇవాళ్ళ కూడా అలాగే జరిగింది కనుక ఆయన నిర్ధిష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఇటువంటి సమావేశాలు ఎన్ని జరిపినా ప్రయోజనం ఉండదని అభిమానులు, విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.