ఇవాళ్ళ జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపధ్యంలో కాంగ్రెస్ నేత విజయశాంతి మళ్ళీ సిఎం కేసీఆర్పై ట్విట్టర్, ఫేస్బుక్లో వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సందించారు. “దుబ్బాక ఉపఎన్నికలలో ఓడిపోయిన తరువాత సిఎం కేసీఆర్ అసదుద్దీన్ అద్భుతదీపం సాయంతో జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవాలని కలలుకంటున్నారు. అయితే ఆయన కూడా పాతబస్తీలోని ప్రజలకు మాయమాటలు చెపుతూ మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నందున ఈసారి ఆ అద్భుతదీపం పనికిరాకపోవచ్చు,” అని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. సిఎం కేసీఆర్... జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి విజయశాంతి ఏమన్నారో ఆమె మాటలలోనే...
దుబ్బాక ఉపఎన్నికలలో ఆమె కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ ఈ రెండు సామాజికమాధ్యమాల ద్వారా ఆమె టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సిఎం కేసీఆర్ను విమర్శిస్తూ ఇటువంటివి అనేక వ్యంగ్య సందేశాలు పెట్టేవారు. అప్పుడు మరిచిపోకుండా తన పేరు క్రింద ‘తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్ పర్సన్’ అని వ్రాసుకొనేవారు. కానీ ఇప్పుడు కేవలం విజయశాంతి అని మాత్రమే వ్రాసుకొన్నారు. ఆమె త్వరలో బిజెపిలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తునందున ఇది ఆలోచించవలసిన విషయమే.