అవును. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బుధవారం ఉదయం ఈగల్ టీమ్ పలువురు విద్యార్ధులకు డ్రగ్ టెస్టులు నిర్వహించడం కలకలం రేపింది. యూనివర్సిటీలో విచ్చలవిడిగా గంజాయి సరఫరా అవుతోందనే పక్కా సమాచారంతో ఈగల్ టీమ్ పోలీసులు ఈరోజు ఉదయం హటాత్తుగా తనికీలు నిర్వహించి, అనుమానం ఉన్న విద్యార్ధులకు డ్రగ్ టెస్టులు కూడా చేశారు. వారిలో 17 మొత్తం మంది విద్యార్ధులు గంజాయి సేవించినట్లు తేలింది.
వారిని ప్రశ్నించి విద్యార్ధులకు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను అస్సాం నుంచి గంజాయి తీసుకువచ్చి, ఒక్కో గ్రాము రూ.500 చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈగల్ టీమ్ పోలీసులు యూనివర్సిటీలో తనికీలు నిర్వహిస్తున్నారు.
సువిశాలమైన యూనివర్సిటీలో తనికీలు పూర్తి చేసేందుకు చాలా సమయం పడుతుంది. కనుక ఈరోజు సాయంత్రం లేదా రేపు ఈగల్ టీమ్ పోలీసులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. హెచ్సీయూలో కేవలం గంజాయి మాత్రమేనా లేక ఇతర మాదక ద్రవ్యాలు కూడా సరఫరా, వాడకం జరుగుతున్నాయా? అనేది పోలీసులు అధికారిక ప్రకటన తర్వాత స్పష్టత వస్తుంది.
కానీ యూనివర్సిటీలో ఈ తనికీలు, వాటిలో గంజాయి సేవిస్తున్న విద్యార్ధులు పట్టుబడటం గమనిస్తే చాపకింద నీరులా గంజాయి, మాదకద్రవ్యాలు ఎంతగా వ్యాపించాయో అర్ధమవుతుంది. ఉన్నత చదువుల కోసం వచ్చిన విద్యార్ధులు ఈవిధంగా గంజాయికి అలవాటు పడి జీవితం నాశనం చేసుకోవడం చాలా ఆందోళన కలిగించే విషయమే కదా?