ఏ దేశంలోనైనా ఎన్నికలలో ఓడిపోయినవారు గెలిచినవారిపై ఏవో ఆరోపణలు చేస్తారు మహా అయితే కోర్టుకు వెళతారు తప్ప ఓడిపోయినా కుర్చీ పట్టుకొని వ్రేలాడరు. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోయిన డోనాల్డ్ ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు... వైట్హౌస్ వీడి వెళ్ళేది లేదని భీష్మించుకొని కూర్చోన్నారు. భార్య మేలానియా, కూతురు ఇవాంక, అల్లుడు జారేడ్ కుష్నర్లు ట్రంప్కు నచ్చజెప్పినప్పటికీ ఆయన పట్టువీడటం లేదు. పైగా ఎన్నికలలో ఘన విజయం సాధించిన జో బైడెన్కు కొత్త తలనొప్పులు సృష్టించాలని ఆలోచిస్తున్నట్లు అమెరికన్ మీడియా కోడై కూస్తోంది.
జో బైడెన్ ఎన్నికను సవాలు చేస్తూ ఆయా రాష్ట్రాల న్యాయస్థానాలలో కేసులు వేయబోతున్నట్లు ట్రంప్ స్వయంగా చెప్పారు. జనవరి 20న జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆలోగా జో బైడెన్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు చేయవలసిన చట్టపరమైన ప్రక్రియ, ఏర్పాట్లు, వాటికి అవసరమైన నిధులు విడుదల చేయకుండా ట్రంప్ తాత్సారం చేస్తుండటంతో వైట్హౌస్ అధికారులు కూడా తలపట్టుకొంటున్నారు. అమెరికాకు కరోనాను అంటగట్టి తనకు ఈ దుస్థితి కల్పించిన చైనాపై ఏదోవిధంగా ట్రంప్ పగ తీర్చుకోవాలనుకొంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైనాను రెచ్చగొట్టి వదిలేస్తే ఆ తరువాత అమెరికా పగ్గాలు చేపట్టే జో బైడెన్కు కొత్త సమస్యలు, సవాళ్ళు ఎదుర్కోక తప్పదు. కనుక వైట్హౌస్ వీడేలోపుగా జో బైడెన్కు ఎన్ని సమస్యలు సృష్టించగలిగితే అన్నీ చేసి మరీ బయటకు వెళ్లాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గత నాలుగేళ్ళలో తన నోటి దురుసు, అహంభావం, నిర్లక్ష్యం, దుందుడుకు నిర్ణయాలతో చేజేతులా తన ప్రతిష్టను దిగజార్చుకొని నవ్వులపాలవడమే కాక, ప్రపంచదేశాల దృష్టిలో ఎంతో ఉన్నతంగా ఉండే అమెరికా పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలిగించారు. ఓటమితో మరోసారి భంగపడిన ట్రంప్ ఇప్పటికీ హుందాగా తప్పుకోకుండా పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తూ వెళ్ళిపోయే ముందు ప్రజల దృష్టిలో ఇంకా చులకన అవుతున్నారు. ఒకవేళ ఆయన తీరు మారకపోతే, అప్పుడు జో బైడెన్ వర్గం ముందే హెచ్చరించినట్లు వైట్హౌస్ నుంచి బలవంతంగా ఖాళీ చేయించినా ఆశ్చర్యం లేదు. అదే కనుక జరిగితే వైట్హౌస్ నుంచి మెడ పట్టించుకొని గెంటించుకొన్న తొలి అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ అమెరికా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. కానీ అంతవరకు రానీయకుండా ఆయన కుటుంబ సభ్యులు ట్రంప్కు నచ్చచెప్పేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు.