హైదరాబాద్ నగరంలో కరోనా చికిత్సకు అనుమతి పొందిన ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే చాలా భారీగా ఫీజులు వసూలుచేస్తున్నారని ఆరోపిస్తూ ఓఎం దేవర అనే రిటైర్డ్ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ్ళ హైకోర్టు విచారణ చేపట్టింది.
“నగరంలో అపోలో, బసవతారకంతో సహా పలు కార్పొరేట్ ఆసుపత్రులు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం నుంచి రాయితీపై భూములు పొందాయని, కానీ ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలకంటే ఎక్కువగా లక్షల రూపాయలు ఫీజులు గుంజుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. చెప్పినంతా ఫీజు చెల్లించకపోతే మృతదేహాలను కూడా అప్పగించడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు తీరుపట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవి ప్రజలను దోచుకొంటుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించింది. వాటి లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా వాటీకిచ్చిన భూములను కూడా వెనక్కు తీసుకొంటే మంచిదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కరోనా రోగులను పీడించి డబ్బులు గుంజుతున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం కటినచర్యలు తీసుకోవాలని, ఏమి చర్యలు తీసుకొందో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.