కరోనా మహమ్మారికి ధనిక పేద తేడాలేవీ ఉండవని నిరూపిస్తున్న మరో ఘటన తమిళనాడులో జరిగింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష డీఎంకె పార్టీ ఎమ్మెల్యే ఆన్బజగన్ (62) ఈరోజు ఉదయం చెన్నైలో కనుమూశారు. ఆయనకు కరోనా సోకడంతో కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కనుమూశారు.
డీఎంకె పార్టీలో ఆన్బజగన్ చాలా సీనియర్ నేత. 2001, 2011,2016 శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకొన్నారు. సినీ పరిశ్రమలో కూడా ప్రవేశించి నిర్మాతగా, డిస్ట్రిబ్యూటరుగా తన సత్తా చాటుకొన్నారు. కానీ ఇన్ని సాధించినప్పటికీ కంటికి కనబడని కరోనాకు బలయ్యారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఒకవేళ కోలుకొని క్షేమంగా ఇంటికి చేరుకొని ఉంటే కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ఈరోజు ఘనంగా పుట్టునరోజు వేడుకలు జరుపుకొని ఉండేవారేమో? కానీ పుట్టినరోజునాడే చితిమంటలలో కాలిపోనున్నారు!
ఆన్బజగన్ త్వరలోనే కోలుకొని ఇంటికి తిరిగివస్తారని ఎదురుచూస్తున్న ఆయన కుటుంబ సభ్యులు, బందుమిత్రులు, అనుచరులు ఆయన చనిపోయారనే వార్త విని దిగ్బ్రాంతి చెందారు. ఆన్బగళన్ కుటుంబ సభ్యులకు డీఎంకె అధినేత స్టాలిన్, ముఖ్యమంత్రి పళనిస్వామి తదితరులు సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నారు.