ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం రాత్రి 8 గంటలకు దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించనున్నారు. ఈ నెల 17తో లాక్డౌన్ గడువు ముగుస్తున్నందున సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించినప్పుడు, వారు పలు సూచనలు చేశారు. వారిలో కొందరు లాక్డౌన్ పొడిగించాలని కోరగా, మరికొందరు దేశంలో మళ్ళీ అన్ని రంగాలు పనిచేసుకొనేందుకు వీలుగా లాక్డౌన్ ఆంక్షలను సడలించి వెసులుబాటు కల్పించాలని కోరారు. వలస కార్మికుల తరలింపుపై కూడా లోతుగా చర్చించారు. కనుక తదనుగుణంగా కేంద్రప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. ముఖ్యంగా లాక్డౌన్ పొడిగించాలా వద్దా? అనే దానిపై ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు తన ప్రసంగంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లాక్డౌన్ పొడిగించదలిస్తే దేశంలో వివిద రంగాలకు, వలస కార్మికులు, నిరుపేదలకు మేలు చేసేవిధంగా ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది.