కేంద్రప్రభుత్వం ప్రకటించిన గ్రీన్జోన్ జిల్లాలలో కొన్ని ఆంక్షలతో మద్యం షాపులు తెరిచేందుకు అనుమతులివ్వడంతో నెలరోజులకుపైగా గొంతులో చుక్క పడక విలవిలలాడిపోతున్న మందుబాబులు చాలా సంతోషిస్తున్నారు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, ములుగు, సిద్ధిపేట, వరంగల్ రూరల్, పెద్దపల్లి, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. కనుక ఆ జిల్లాలో మందుబాబులు మద్యం దుకాణాలు ఎప్పుడు తెరుస్తారా...అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ స్థానిక పరిస్థితుల ఆధారంగా ఆంక్షల సడలించాలా వద్దా?అని నిర్ణయం తీసుకొనే అధికారాన్ని కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. కనుక తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్..ఆంక్షల సడలింపులపై చర్చించేందుకు సిఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షల సడలింపులపై మంత్రివర్గం ఎటువంటి నిర్ణయం తీసుకొంటుందో తెలియాలంటే అప్పటి వరకు ఎదురుచూడక తప్పదు.