కంటికి కనబడని కరోనా వైరస్ దేశంలో ప్రవేశించినప్పటి నుంచి 24 గంటలు రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కరోనా ప్రభావం ఏవిధంగా ఉంటుందో తెలియేజేస్తోందీ విషాదఘటన. పంజాబ్లోని లూధియానా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్గా పని చేస్తున్న అనీల్ కోహ్లీ శనివారం సాయంత్రం కరోనాతో మృతి చెందారు. నాలుగైదు రోజుల క్రితం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో లుధియానాలోని ఎస్పీఎస్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ వైరల్ లోడ్ చాలా పెరిగిపోవడంతో ఈరోజు ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు. స్థానిక పోలీస్ ఉన్నతాధికారులు ఆయన మృతిని దృవీకరించారు. లాక్డౌన్ సందర్భంగా రోజూ వందలాదిమందితో కాంటాక్ట్ అయ్యే మన పోలీసులందరికీ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, వారి ఆరోగ్యం గురించి పోలీస్ శాఖ మరింత జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.