కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం 3వారాలపాటు అంటే ఏప్రిల్ 14వరకు దేశమంతటా లాక్డౌన్ అమలుచేస్తోంది. లాక్డౌన్ ప్రకటించి ప్రజల కదలికలను పూర్తిగా స్తంభింపజేసినందునే దేశంలో కరోనా వ్యాప్తి చాలా నియంత్రణలో ఉందని చెప్పవచ్చు లేకుంటే ఇటలీ, స్వీడన్, అమెరికా దేశాలలోలాగ శరవేగంగా దేశమంతటా కరోనా వ్యాపించి ఉండేది. లాక్డౌన్ వలన దేశ ఆర్ధికవ్యవస్థ కుదేలు అవుతున్నప్పటికీ కరోనా వ్యాప్తిని అరికట్టగలుగుతున్నందున కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు లాక్డౌన్ను పొడిగించవచ్చునని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆ ఊహాగానాలను కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఖండించారు.
సోమవారం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “లాక్డౌన్ పొడిగిస్తామనే వార్తలను ఖండిస్తున్నాము. అవన్నీ అవాస్తవాలు... ఊహాగానాలే. వాటిని నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాము. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీ ఏప్రిల్ 14వరకు మాత్రమే లాక్డౌన్ ప్రకటించారు. కనుక లాక్డౌన్ ఆదేశాలను మన్నించి దేశప్రజలు ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని రాజీవ్ గౌబా అన్నారు.