ప్రజలకు...ముఖ్యంగా నిసహాయులకు..సమస్యలు ఎదుర్కొంటున్నవారికి సహాయపడటంలో ఆ తండ్రీకొడుకులు వారికివారే సాటి. సగటు రాజకీయనాయకులకు పూర్తి భిన్నంగా ప్రజాసమస్యలను మానవీయకోణంలో నుంచి చూసి పరిష్కరిస్తూ జేజేలు అందుకొంటుంటారు. వారే సిఎం కేసీఆర్ ఆయన కుమారుడు మునిసిపల్ మంత్రి కేటీఆర్.
రాష్ట్రంలో 21 రోజుల లాక్డౌన్ అమలులో ఉంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కూడా అమలులో ఉంది. ఇలాంటప్పుడు కుటుంబాలతో కలిసి హాయిగా ఇళ్ళలో ఉంటున్న వారే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొంటున్నప్పుడు హైదరాబాద్ నగరంలో రోడ్లపైనే నివశిస్తున్న వారి పరిస్థితి ఏమిటి? రోడ్లపైకి వస్తేనే కరోనా సోకే ప్రమాదం ఉన్నప్పుడు, పగలు రాత్రి రోడ్లపైనే బ్రతుకుతున్న వారి పరిస్థితి ఏమిటి? కరోనా కర్ఫ్యూ సమయంలో వారు ఎక్కడ ఉండాలి? లాక్డౌన్ కారణంగా పనులు లేక ఆదాయం లేని వారు ఏవిధంగా బ్రతకాలి? అనే సందేహాలు ఎవరికైనా వచ్చాయో లేదో తెలీదు కానీ మంత్రి కేటీఆర్కు వచ్చాయి. వారి పరిస్థితుల గురించివాకబు చేసిన కేటీఆర్, బుదవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మునిసిపల్ అధికారులతో సమావేశమైనప్పుడు, రోడ్లపై నివసిస్తున్నవారందరికీ స్వచ్ఛందసంస్థలు, ప్రైవేట్ హాస్టళ్ళలో నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాదు...ఈ లాక్డౌన్ గడువు ముగిసేవరకు వారికి రెండుపూట్ల రూ.5 భోజనం అందించాలని ఆదేశించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో తన బాధ్యత తీరిపోయిందని అనుకోకుండా గోల్నాకలో ఏర్పాటు చేసిన నైట్ షెల్టరుకు వెళ్ళి దానిలో ఆశ్రయం పొందుతున్నవారితో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వారితో సహా నగరంలో ఎవరు డయల్ 100కు ఫోన్ చేసి సహాయం కోరినా తక్షణమే సహాయపడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, నిత్యావసర సరుకుల కొరత లేదని, ఎప్పటిలాగే అన్ని బజారులో లభించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పాలు, ఆహారపదార్ధాలు, మందులు ఆన్లైన్లో కొనుగోలు లభించేలా చూస్తామని చెప్పారు.