ముగ్గురు పిల్లలను నీట ముంచి చంపింది తండ్రే

March 07, 2020


img

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలోని రాజారం దుబ్బ చెరువులో చనిపోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు అఫీయా(10), మహీన్‌(9), జోయా(7)లను వారి తండ్రి ఫయాజ్ స్వయంగా నీట ముంచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. 

తాగుడు, చెడు వ్యసనాలకు బానిస అయిన ఫయాజ్ ఏ పనిచేయకుండా భార్య నీలోఫర్‌ను తరచూ డబ్బు కోసం వేధిస్తుండేవాడు. దాంతో వారి మద్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వారికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అఫీయా బేగం(10), మహీన్‌ బేగం(9), జోయా బేగం(7),కుమారుడు రహీజ్ (6) వారితోనే ఉంటున్నారు. డబ్బు కోసం ఆశపడి ఫయాజ్ తమ చివరి కుమార్తెను ఎవరికో రూ.50,000కు అమ్మేసినట్లు తెలుస్తోంది. 

ఇంట్లో అందరూ ఆడపిల్లలే కావడంతో ఫయాజ్ వారిని అసహ్యించుకొనేవాడని భార్య నీలోఫర్, ఇరుగుపొరుగులు చెప్పారు. రెండు రోజుల క్రితం పోలీసులు వేరే కేసు విచారణ నిమిత్తం గ్రామానికి వచ్చినప్పుడు, నీలోఫర్ తన భర్త ప్రవర్తన గురించి వారికి ఫిర్యాదు చేయగా వారు అతనిని గట్టిగా మందలించారు. దాంతో భార్యపై ఆగ్రహం చెందిన ఫయాజ్, శుక్రవారం ఉదయం ఆమె ఇంట్లో లేని సమయంలో నలుగురు పిల్లలకు బందువుల ఇంట్లో విందుకు తీసుకువెళ్తానని మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్ళాడు. దారిలో ఉన్న చెరువులో స్నానం చేసి వెళ్దామని చెప్పి అందరినీ చెరువులోకి దింపాడు. కానీ నీళ్ళలోకి దిగడానికి భయపడిన రహీజ్ మాత్రం పారిపోయి ఇంటికి వచ్చేశాడు. దాంతో అతను బ్రతికిపోయాడు. 

తండ్రికి భయపడి చెరువులో దిగిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మాత్రం అతని చేతిలోనే ప్రాణాలు కోల్పోయారు. వారి ముగ్గురినీ ఫయాజ్ నీళ్ళలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. ఇంటికి పారిపోయి వచ్చిన రహీజ్ ద్వారా ఈ విషయం తెలుసుకొన్న తల్లి నీలోఫర్, గ్రామస్తులు పరుగున చెరువు వద్దకు వెళ్ళగా తడిసిన బట్టలతో వస్తున్న ఫయాజ్ వారికి ఎదురయ్యాడు. చెరువు ఒడ్డునే ముగ్గురు పిల్లలు విడిచిన చెప్పులు కనబడటంతో వారికి పరిస్థితి అర్ధమైంది. కొందరు యువకులు చెరువులో దిగి గాలించి ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. ఫయాజ్‌ను పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఫయాజ్ నేరం అంగీకరించాడు. గ్రామస్తులు, ఫయాజ్ బందువులు బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకొని అతనిని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. 


Related Post