హీరో మహేశ్‌బాబుకు జగనన్న దీవెన!

February 26, 2020


img

హీరో మహేశ్‌బాబుకు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి దీవెన లభించింది. అదే...ఏపీ సర్కార్ ప్రారంభించిన ‘జగనన్న దీవెన విద్యాపధకం’ లబ్దిదారు కార్డు లభించింది. కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలో గల వైష్ణవీ డిగ్రీ కళాశాలలో బీకాం డిగ్రీ చదువుతున్న ఈడిగ లోకేశ్ గౌడ్ అనే విద్యార్ధి ఈ పధకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకొన్నప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. 

ఏపీ సర్కార్ కొత్తగా ప్రారంభించిన వార్డు సచివాలయ ఉద్యోగులో లేదా లబ్దిదారుల వివరాలను నమోదు చేసుకొనే వార్డు వాలంటీర్లలో ఎవరో లబ్దిదారుడు ఈడిగ లోకేశ్ గౌడ్ ఫోటో స్థానంలో హీరో మహేశ్‌బాబు ఫోటో పెట్టారు. సచివాలయ సిబ్బంది కూడా దానిని సరిచేయకుండా తమ కంప్యూటర్‌ రికార్డులలో అలాగే నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటపడటంతో అందరూ తలపట్టుకొంటున్నారు. జిల్లా అధికారులు ఈ వ్యవహారంతో తమకు సంబందం లేదని చేతులు దులుపుకోగా, వార్డు సచివాలయ సిబ్బంది కూడా తమ తప్పు లేదని వాదిస్తున్నట్లు తెలుస్తోంది.


గతంలో చంద్రబాబునాయుడు ఏపీని పాలిస్తున్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వ తీరును, దాని విధానాలను విమర్శిస్తుండేవారు. కనుక ఆయన మనసాక్షి.. సాక్షి మీడియా కూడా ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు ప్రచురిస్తుండేది. కానీ ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నందున సాక్షి మీడియా ఏపీ ప్రభుత్వానికి, సిఎం జగన్‌కు అనుకూలవార్తలు వ్రాస్తుండగా ఆనాడు సాక్షి మీడియా నిర్వర్తించిన ‘ప్రతిపక్షపాత్ర’ను ఇప్పుడు ఆంధ్రజ్యోతి, తదితర మీడియా సంస్థలు నిర్వర్తిస్తున్నాయి. కనుక జగన్ ప్రభుత్వం కూడా ఇటువంటి నొప్పులు భరించకతప్పదేమో? 


Related Post