కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జవాబు

January 28, 2020


img

మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు దక్కించుకొనేందుకు కాంగ్రెస్‌, బిజెపిలు చేతులు కలిపాయి కనుక పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బిజెపి కండువా కప్పుకోవాలంటూ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేయడంపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. నల్గొండలో బిజెపి, మజ్లీస్ పార్టీలతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీని అడ్డుకొనేందుకు ప్రయత్నించినందుకు కేటీఆరే బిజెపి, మజ్లీస్ కండువాలు కప్పుకోవాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బదులిచ్చారు. యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ వచ్చినప్పటికీ, ఇండిపెండెంట్లు, ఎక్స్‌అఫీషియోలను అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్‌ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు దక్కించుకొందని ఆరోపించారు. కేటీఆర్‌ తండ్రి కంటే రెండాకులు ఎక్కువే చదివారని, రాష్ట్రంలో రాజకీయవ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాలలో పదవుల కోసం ఆరాటం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ ఆరాటం ఇప్పుడు మరింతగా పెరిగి వాటి కోసం రోడ్లపై కొట్టుకొనే స్థితికి దిగజారిపోయారు. ఈ కొట్లాతలు, నీచరాజకీయాలు చూస్తుంటే వారు ప్రజలకోసం కాక పదవుపదవుల కోసమే రాజకీయాలు చేస్తున్నారని స్పష్టం అవుతోంది. ప్రజలందరూ చూస్తుండగానే ఇంత బరితెగించి వ్యవహరిస్తూ, అనైతిక రాజకీయాలు చేస్తూ మళ్ళీ ధర్మపన్నాలు వల్లిస్తుండటం ఇంకా విడ్డూరం.


Related Post