ఆర్టీసీ సమ్మె సందర్భంగా సిఎం కేసీఆర్ను తీవ్రంగా విమర్శించిన ఆర్టీసీ కార్మికులే ఇప్పుడు ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ జేజేలు పలుకుతుండటం విశేషం. ఆర్టీసీ కార్మికులకు పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సం.లకి పెంచినందుకు కృతజ్ఞతగా వారు పాలాభిషేకాలు చేస్తున్నారు.
ఈరోజుల్లో ఏదైనా పధకం వలన లబ్ది పొందినవారు ఆ విషయం అందరికీ తెలిసేలా కృతజ్ఞతలు తెలుపుకోవడం ఓ ఆనవాయితీగా మారింది కనుక ఇదేమీ చిత్రంగా అనిపించదు. అయితే ప్రస్తుతం ఆర్టీసీలో జరుగుతున్న ప్రక్షాళన, పెనుమార్పుల కారణంగా ఆర్టీసీలో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడుతాయో... ఎవరికి ఎక్కడ ఎటువంటి బాధ్యతలు అప్పగించబడతాయో తెలియక ఆర్టీసీ కార్మికులలో ఆందోళన నెలకొని ఉంది. బహుశః ఆ భయాందోళనలతోనే తామందరం సిఎం కేసీఆర్కు విధేయులమని చాటి చెప్పుకొనేందుకు ఈవిధంగా మీడియా సమక్షంలో హడావుడి చేస్తున్నారేమోననే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వారి అత్యుత్సాహం చూస్తుంటే కార్మికులందరూ తెరాసలో చేరిపోయారా? అనిపించకమానదు. ప్రస్తుత పరిస్థితులలో అదే మంచిదేమో!