దిశ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపినప్పటికీ అటువంటి ఆలోచనలున్నవారిలో ఏమాత్రం భయం ఏర్పడలేదు... కనుక రాష్ట్రంలో అత్యాచారాలు ఆగట్లేదు. ఒకవైపు దిశ కేసులో దర్యాప్తు, విచారణలు జోరుగా సాగుతుండగానే మరోవైపు యధాప్రకారం అత్యాచారాలు కొనసాగుతున్నాయి.
తాజాగా కరీంనగర్ జిల్లాలో బొమ్మకల్ గ్రామంలో 9 నెలల నిండు గర్భిణిపై కనపర్తి రామకృష్ణ అనే వ్యక్తి అత్యాచారం చేసాడు. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో డిష్ రిపేరు చేస్తానంటూ ఇంట్లోకి జొరబడి ఆమెపై అత్యాచారం చేసాడు. ఈ ఘటన గురించి ఆమె తన భర్తకు తెలియజేయగా ఇరువురూ కలిసి కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు దళితవర్గానికి చెందినది కావడంతో పోలీసులు అత్యాచార నేరంతోపాటు ఎస్సీ, ఎస్టీ సెక్షన్స్ క్రింద కూడా కేసులు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
అత్యాచార ఘటనలపై ప్రజలు, ప్రభుత్వాలు, పోలీసులు, న్యాయస్థానాలు తీవ్రంగా స్పందిస్తున్నప్పటికీ ఇటువంటి నేరస్తులలో ఏ మాత్రం భయం, బెరుకు కలుగకపోవడం చాలా ఆశ్చర్యకరమే. ఇటువంటి నేరాలపై కోర్టులు వేగంగా విచారణ పూర్తిచేసి దోషులకు కటిన శిక్షలు విధించగలిగితేనే నేరగుణం ఉన్నవారిలో భయం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఇదే ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది.