అక్రమాస్తుల కేసులో బెంగళూరులో అగ్రహారం జైలులో నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ (తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు)కు ఐటిశాఖ మరో షాక్ ఇచ్చింది. బినామీ ఆస్తుల చట్టం క్రింద రూ.1,600 కోట్లు విలువచేసే ఆమె ఆస్తులను ఐటిశాఖ సోమవారం జప్తు చేసుకొంది. 2016లో పెద్దనోట్లు రద్దు తరువాత ఆమె బినామీ పేర్లతో భారీగా ఆస్తులను కొనుగోలుచేసినట్లు గుర్తించిన ఐటిశాఖ, చెన్నై, కోయంబత్తూర్, పుదుచ్చేరిలతో తమిళనాడులో 9 ప్రాంతాలలో రూ.1,600 కోట్లు విలువచేసే ఆస్తులను ఐటిశాఖ సోమవారం జప్తు చేసింది.
అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్ళిన ఆమె జైలులో తన సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని జైలు శిక్షను తగ్గించి తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఒక పిటిషన్ వేశారు. కానీ న్యాయస్థానం ఆమె పిటిషన్ను కొట్టివేసింది. ఆమె రెండేళ్ళు ముందుగానే జైలులో నుంచి బయటకు వచ్చేయాలని ఆతృత పడితే, తాజాగా నమోదైన ఈ కొత్త ఐటి కేసుతో మరి కొన్నేళ్లు జైల్లో చిప్పకూడు తినకతప్పేలా లేదామెకు.