టిడిపి బహిష్కృతనేత మోత్కుపల్లి నర్సింహులు నేడు బిజెపిలో చేరానున్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్ళి బిజెపిలో చేరవలసిందిగా ఆహ్వానించగా, ఇటువంటి అవకాశం కోసమే చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉంది.
మోత్కుపల్లి నర్సింహులు టిడిపి వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో టిడిపి నానాటికీ బలహీనపడి దాని ఉనికి ప్రశ్నార్ధకంగా మారడంతో ఆయన టిడిపిని తెరాసలో విలీనం చేయాలని సూచించగా దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబునాయుడు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తరువాత తెరాసలో చేరేందుకు ఆసక్తి చూపారు కానీ తెరాస స్పందించలేదు. దాంతో ఆయన రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారు. ఈ నేపధ్యంలో ఆయనకు బిజెపిలోకి ఆహ్వానం వచ్చింది కనుక ఆలస్యం చేయకుండా దానిలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. ఆయన బిజెపిలో చేరితే మళ్ళీ సిఎం కేసీఆర్, తెరాస సర్కార్పై విమర్శలు గుప్పించడం ఖాయం.