బాబువి మొసలి కన్నీళ్లు: తలసాని

September 19, 2019


img

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు చంద్రబాబునాయుడే కారణమని ఆరోపించారు. ఆయనను పార్టీలో దూరంగా పెట్టి మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు. ఆయనపై ఏపీలో అధికార పార్టీ నేతలు కొందరు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పుడు, చంద్రబాబునాయుడు వాటిని ఖండించలేదని అన్నారు. కోడెల కష్టకాలంలో పట్టించుకోని చంద్రబాబునాయుడు, ఆయన చనిపోయాక శవయాత్రలో మొసలి కన్నీళ్ళు కార్చుతూ ప్రజల సానుభూతి పొందాలని కపటనాటకం ఆడారని ఆరోపించారు. కోడెల మృతిపై చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ ప్రజలు వారి నాటకాలను నమ్మబోరని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

కోడెల మృతికి జగన్ ప్రభుత్వ వేధింపులే కారణమని ఆయన కుమార్తె తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ, టీఆర్‌ఎస్ పార్టీల అధినేతల మధ్య బలమైన అనుబందం ఉంది కనుక ఈ వ్యవహారంలో తెరాస సర్కార్‌ జగన్‌ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేవిధంగా వ్యవహరించదని అందరికీ తెలుసు. తలసాని చేసిన ఈ తాజా విమర్శలతో కోడెల ఆత్మహత్య వ్యవహారంలో తెరాస సర్కార్‌ వైఖరి స్పష్టం అయ్యింది. 

కోడెలపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు, పెట్టిన కేసులు, ఫర్నీచర్ కేసులను పక్కన బెడితే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయినందున ప్రస్తుతం ప్రజలలో ఆయనపై సానుభూతి ఉంది. కనుక తలసాని ఆరోపించినట్లు కోడెల మృతిని టిడిపి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తోంది. అయితే కోడెల మృతిపై చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించినపుడు, వైసీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు కూడా అటువంటి ప్రయత్నాలు చేయకుండా హుందాగా వ్యవహరిస్తూ, ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి నిజాలు బయటపెడితే  ప్రజలు హర్షిస్తారు లేకుంటే టిడిపి వాదనలకు బలం చేకూరవచ్చు.


Related Post