ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో డిల్లీ స్పెషల్ కోర్టు మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి చిదంబరంకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను తిహార్ జైలుకు తరలించారు. గత నెల 21 రాత్రి నాటకీయ పరిణామాల మద్య చిదంబరాన్ని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన సుప్రీంకోర్టులో బెయిల్పై కోసం న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు కానీ ఫలితం లేదు. ఒకపక్క సిబిఐ కస్టడీలో అధికారులు సంధించే యక్షప్రశ్నలు, మరోపక్క బెయిల్పై మంజూరుకు సుప్రీంకోర్టు పదేపదే నిరాకరిస్తుండటం, చివరికి కరడుగట్టిన నేరస్తులను ఉంచే తీహార్ జైలులో గడపవలసి రావడం చూస్తే పాపం...చిదంబరం అనిపించకమానదు. ఇన్ని కష్టాలు, అవమానకర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని తెలియకనే మన రాజకీయ నాయకులు అవినీతి వలన కలిగే సిరిసంపదలు, సౌఖ్యాల కోసం ఆరాటపడుతుంటారా?అనే అనుమానం కలుగకమానదు.
ఇప్పుడు ‘ప్రతీకార రాజకీయాల ట్రెండ్’ నడుస్తోంది కనుక ఇకనైనా రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటే వారికే మంచి లేకుంటే ఏదో ఓ రోజు వారికీ ఇదే పరిస్థితి దాపురించే ప్రమాదం ఉంటుందని మరిచిపోకూడదు.