మంగళవారం మంత్రివర్గ విస్తరణ జరుగబోతోంది...అయితే తెలంగాణ రాష్ట్రంలో కాదు కర్ణాటకలో. జూలై 26న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప ఇటీవల డిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి తన మంత్రివర్గానికి ఆమోదముద్ర వేయించుకుని వచ్చారు. సిఎంతో కలిపి మంత్రివర్గంలో 34 మందిని నియమించుకునే అవకాశం ఉన్నప్పటికీ తొలివిడత విస్తరణలో 12 లేదా 13 మందిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం కర్ణాటక రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది.
కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చివేసి అధికారం చేజిక్కించుకున్నప్పటికీ సిఎం యడియూరప్పపై మంత్రిపదవుల కోసం తీవ్ర ఒత్తిడి ఉంది. ఒకేసారి 33 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లయితే పదవులు దక్కని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది కనుక మొదటివిడతలో కొంతమందినే తీసుకొంటున్నారని భావించవచ్చు. తద్వారా పార్టీలో మంత్రిపదవులు ఆశిస్తున్నవారు వాటి కోసం ఆశగా ఎదురుచూస్తూ యడియూరప్పకు విధేయంగా ఉంటారనే సంగతి వేరే చెప్పక్కరలేదు.