తెరాస నాయకులతో సహా అందరూ ఎప్పుడెప్పుడాని ఆత్రంగా ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం, పేర్లు ఖరారు అయినట్లు సమాచారం. ఆగస్ట్ 6వ తేదీన కేటీఆర్, హరీష్రావు, తుమ్మల నాగేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డిలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తాజా సమాచారం.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిపి మంత్రివర్గంలో 12మంది ఉన్నారు. మరో ఆరుగురిని నియమించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నలుగురికి, మున్సిపల్ ఎన్నికల తరువాత మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గత మంత్రివర్గంలో ఒక్క మహిళను కూడా తీసుకోకుండా పాలన సాగించినందుకు సిఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు కనుక ఈసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తానని ప్రకటించారు. పార్టీలో సీనియర్లను కాదని పార్టీలో కొత్తగా చేరిన సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వాలనుకోవడం నిజమైతే అది ఆశ్చర్యకరమైనదే. సబితకు మంత్రిపదవి ఇచ్చినట్లయితే ఆ పదవి కోసం ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న పార్టీలోని సీనియర్ నేతలు అసంతృప్తికి గురవడం ఖాయమే. కానీ మిగిలిన రెండు మంత్రిపదవులు భర్తీ చేసే వరకు పార్టీలో అందరూ సంయమనంగానే ఉండవచ్చు. అసలు కధ ఆ తరువాతే మొదలవవచ్చు.