కారణం ఏదైతేనేమి...పార్టీ వీడుతున్నారుగా!

June 20, 2019


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈవిషయం వేరెవరో కాదు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్పారు కనుక నమ్మాల్సిందే. డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “రాజగోపాల్ రెడ్డి తాను ఆర్ధికకారణాలతో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు నాకు చెప్పారు. అటువంటి కారణంతో పార్టీని విడిచిపెడుతున్న ఆయన ఇప్పుడు ఏదైనా చెప్పవచ్చు,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

కానీ రాజగోపాల్ రెడ్డి వేరేగా చెప్పారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాల తప్పుడు నిర్ణయాలు, నాయకత్వ లోపాల కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు ఓడిపోయిందని, ఇప్పుడు ఏకంగా తుడిచిపెట్టుకుపోయే దుస్థితి ఏర్పడిందని అందుకే తన దారి తాను చూసుకోక తప్పడం లేదన్నట్లు మాట్లాడారు. 

ఇద్దరు చెపుతున్న కారణాలు పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ, రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడం ఖాయమైనట్లే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో తన నివాసంలో మునుగోడు కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశమయ్యి బిజెపిలో చేరికపై చర్చిస్తున్నారు. పైగా కాంగ్రెస్‌ క్రమశిక్షణా సంఘం నుంచి షో కాజ్ నోటీసు కూడా అందుకున్నారు. కనుక కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం ఖాయం. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా మరికొద్దిసేపటిలో లేదా నేడు కాకపోతే రేపైన అధికారికంగా ప్రకటించవచ్చు. అయితే ఆయనతో పాటు వెంకట్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళతారా లేక మరికొంతకాలం కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతారా? అనేది తెలియవలసి ఉంది. 


Related Post