ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డున గల పాత సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి సిఎం కేసీఆర్ త్వరలో శంఖుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. వాస్తవానికి కేంద్ర రక్షణశాఖ ఆధీనంలో ఉన్న సికిందరాబాద్లోని బైసన్ పోలో మైదానంలో సిఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకొన్నారు. కానీ ఇంతవరకు కేంద్రప్రభుత్వం ఆ భూములను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించకపోవడంతో ఆ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. పాత సచివాలయంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల వాపసు చేయడంతో ఇప్పుడు కొత్త సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. పాత భవనాలను కూల్చి వేసి అక్కడే అత్యాధునిక సౌకర్యాలతో కొత్త సచివాలయం నిర్మించే ఆలోచనలో సిఎం కేసీఆర్ ఉన్నట్లు తాజా సమాచారం.