తమిళనాడులోని డిఎంకె పార్టీని ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామిగా చేరవలసిందిగా ఆహ్వానించేందుకు తెలంగాణ సిఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం చెన్నై వెళ్లారు. అయితే ఆ పార్టీ అధినేత స్టాలిన్ ఎన్నికల హడావుడిలో ఉన్నందున కలువలేకపోయారు. సోమవారం సాయంత్రం స్టాలిన్తో భేటీకాబోతున్నట్లు తెలుస్తోంది. ఆలోగా కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను దర్శించుకొని వస్తారు.
తమిళనాడులో కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉంటున్న డిఎంకె పార్టీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీతోనే కలిసి సాగాలనుకొంటున్నట్లు స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ సిఎం కేసీఆర్ డిఎంకె పార్టీని ఫెడరల్ ఫ్రంట్లోకి ఆహ్వానించాలనుకోవడం, అందుకోసం పనిగట్టుకొని ఆ పార్టీ అధినేతస్టాలిన్తో భేటీ కావాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈసారి కాంగ్రెస్, బిజెపిలు రెంటికీ కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు సరిపడినన్ని ఎంపీ సీట్లు రావని సిఎం కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. డిఎంకె, జెడియు, టిడిపి, ఎస్పీ, బీఎస్పీ, బిజెడి తదితర పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ అది ప్రభుత్వం ఏర్పాటుచేయలేని స్థితిలో ఉంటే, అప్పుడు ప్రాంతీయపార్టీలను ఫెడరల్ ఫ్రంట్లోకి ఆకర్షించగలిగితే డిల్లీలో కేసీఆర్ నిర్ణయాత్మకపాత్ర పోషించగలుగుతారు. కానీ కాంగ్రెస్, బిజెపిలలో ఏ ఒక్కటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఒక ప్రతిపాదనగానే మిగిలిపోవచ్చు.