ఇంటర్ పరీక్షలలో వివిద కారణాలతో ఫెయిల్ అయిన లేదా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్దులకు ఒక శుభవార్త. ఈరోజు సిఎం కేసీఆర్ ప్రగతి భవన్లో విద్యాశాఖా మంత్రి జగదీశ్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, ఇంటర్బోర్డు కార్యదర్శి అశోక్కుమార్ తదితర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలు, వాటికి గల కారణాలపై లోతుగా చర్చించారు. పరీక్షలో తప్పిన విద్యార్దుల ఆత్మహత్యలు చేసుకొంటుండటంపై సిఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సిఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.
1. ఇంటర్ పరీక్షలలో వివిద కారణాలతో ఫెయిల్ అయిన విద్యార్దులందరి పరీక్షా పత్రాలను ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా రీ-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ చేయాలని ఆదేశించారు.
2. ఇంటర్ పరీక్షలలో తక్కువ మార్కులతో పాసైన విద్యార్దులకు గతవిధానం ప్రకారమే రీ-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ చేయాలని ఆదేశించారు.
3. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నందున, రీ-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ మరియు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ భాద్యతల నుంచి ఆయనను తప్పించి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డికి అప్పగించారు.
4. ఇంటర్ విద్యార్దులు విద్యా సంవత్సరం నష్టపోకుండా వీలైనంత త్వరగా రీ-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ మరియు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పూర్తి చేయాలని ఆదేశించారు.
5. సప్లిమెంటరీ పరీక్షలలో మళ్ళీ సమస్యలు పునరావృతం కాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.