మరో వారంరోజులలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి కీలకసమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అనిల్ చంద్రా పునేఠాను ఎన్నికల విధుల నుంచి తప్పించి ఆయన స్థానంలో 1983 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు అనిల్ చంద్రా పునేఠాను ఎన్నికలతో సంబందంలేని బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం ఇంటలిజన్స్ చీఫ్ ఏబి వేంకటేశ్వరరావును ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించినప్పుడు, ఆయన బదిలీని నిలిపివేస్తో ప్రత్యేకంగా జీవో జారీ చేశారు. ఆ జీవోలను ఆయనే జారీ చేసినప్పటికీ సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే జారీ చేసి ఉంటారనేది బహిరంగ రహస్యం. కానీ ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు అనిల్ చంద్రా పునేఠాను విధుల నుంచి తప్పించింది.
ప్రభుత్వంలో అత్యంత కీలకపాత్ర నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ఎన్నికలకు ముందు బదిలీ చేయడం టిడిపికి ఎదురుదెబ్బేనాని చెప్పవచ్చు. నరేంద్రమోడీ ఉద్దేశ్యపూర్వకంగానే తనను తన ప్రభుత్వాన్ని వేధిస్తున్నారని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి వేధింపులకు భయపడబోనని అన్నారు.