మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలోని తన అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ తెరాసలో కలిసిపోతున్నాయి. సిఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి రాష్ట్ర ప్రజలందరూ ఆయన నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు కనుకనే రాష్ట్రంలో పార్టీల నేతలు, కార్యకర్తలు అందరూ తెరాసలో చేరేందుకు తరలివస్తున్నారు. సునీతా లక్ష్మారెడ్డి చేరికతో నర్సాపూర్ నియోజకవర్గంలో తెరాస మరింత బలోపేతం అవుతుంది. ఈసారి లోక్సభ ఎన్నికలలో ఒక్కో నియోజకవర్గం నుంచి తెరాస కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని భావిస్తున్నాము. మెదక్ నియోజకవర్గంలోనే తెరాసకు అత్యధిక మెజారిటీ వస్తుందని భావిస్తున్నాము.
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు తెరాసలో చేరుతున్న మాట వాస్తవమే. దానికి వారు, తెరాస చెప్పుకొంటున్న కారణాలతో పాటు ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయని అందరికీ తెలుసు. కారణాలు ఏవైనప్పటికీ, ఈ ఫిరాయింపుల వలన రాష్ట్రంలో ప్రతిపక్షమనేది లేకుండా చేయాలనేది తెరాస లక్ష్యం. ఆవిధంగా చేయడం అనైతికం, అప్రజాస్వామికం అనే సంగతి తెలిసి ఉన్నప్పటికీ, తమ చర్యలను ఇంత గొప్పగా సమర్ధించుకోవడం కేవలం తెరాసకే చెల్లు.