చేవెళ్ళ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్సభకు పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ నేత, మెగా స్టార్ చిరంజీవి రాబోతున్నారు. ఈనెల 8న యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీ వికారాబాద్లో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. ఆమెతో పాటు చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.
గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఓడిపోయిన తరువాత చిరంజీవి మళ్ళీ సినీరంగంలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగి చూడలేదు. ప్రస్తుతం సైరా సినిమా షూటింగుతో బిజీగా ఉన్నారు. బహుశః కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభ్యర్ధన మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అంగీకరించి ఉండవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చిరంజీవి చేత ఎన్నికల ప్రచారం చేయించుకొంటే మంచిదో కాదో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆలోచించుకొంటే మంచిది.