తెలంగాణ రాష్ట్రంలో నామమాత్రంగా ఉన్న వైసీపీ ఆంధ్రాలో మాత్రం అధికారానికి 10 రోజుల దూరంలో ఉన్నట్లు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు ఎలాగూ ముందే పసిగడతారు. సినీ ప్రముఖులు కూడా బాగానే గ్రహించినట్లే ఉన్నారు. బహుశః అందుకేనేమో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు లోటస్ పాండ్ కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే జయసుధ, మోహన్ బాబు, ఆలీ, పృధ్వీరాజ్, కృష్ణుడు తదితర సినీ ప్రముఖులు వైసీపీ కండువాలు కప్పుకొన్నారు. ఈరోజు డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు, హేమ, నటి శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డి కూడా జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.
డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు మొదట్లో వైసీపీలోనే ఉండేవారు. కానీ జగన్తో విభేధాల కారణంగా బయటకు వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ గూటికే చేరుకొన్నారు. జీవిత మీడియాతో మాట్లాడుతూ, “గతంలో జగన్తో విభేదించి వైసీపీని వీడిన మాట వాస్తవమే. కానీ ఎవరితోనూ శతృత్వం ఉండకూడదనే ఉద్దేశ్యంతో మళ్ళీ వైసీపీలో చేరాము. ఇదివరకటి కంటే జగన్లో చాలా మార్పు వచ్చింది. తండ్రిబాటలోనే నడుస్తున్న జగన్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని మేము భావిస్తున్నాము. ఆయన గెలుపుకోసం కృషి చేస్తాము,” అని చెప్పారు.